కనకపు సింహాసనంపై కూర్చోబెట్టినంత మాత్రాన వెనకటి బుద్ధులేడికి పోతయన్నట్టు.. వదరుబోతు రేవంత్రెడ్డి లాంటి కురచ బుద్ధుల నేతను అందలమెక్కించినందుకు ఆ పార్టీ పాపపు ఫలితాన్ని అనుభవిస్తున్నది. నోరున్నది కదా అని ఎవరినైనా తిట్టించవచ్చుననుకొని పీసీసీ పీఠంపై కూర్చోబెట్టినందుకు అదే భస్మాసురహస్తంగా మారింది. ఇతరులను తిడతాడనుకొంటే.. తమ పార్టీ జాతీయ స్థాయి నాయకులనే అడ్డగోలుగా తిట్టించుకొనే పరిస్థితిని కోరి కొని తెచ్చుకొన్నది. భారతదేశంలో శశిథరూర్ ఒక మంచి స్కాలర్. ఐక్యరాజ్యసమితిలో భారత్కు ప్రతినిధిత్వం వహించిన నేత. కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
ఇప్పుడు పార్లమెంటరీ స్థాయీసంఘానికి నేతృత్వం వహిస్తున్నశశిథరూర్ను గాడిద అంటూ అత్యంత అమర్యాదకరంగా రేవంత్ అవమానించారు. బరితెగించి నానా మాటలు అని.. తీరా పత్రికల్లో వచ్చాక తాను అనలేదంటూ అబద్ధాలాడటానికి కొంచెం కూడా సిగ్గు పడని రేవంత్.. తర్వాత ఆడియో క్లిప్పులు విడుదల కావడంతో.. ఓటుకు నోటు కేసు దొంగ మరోసారి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా రేవంత్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని హెచ్చరించడంతో రేవంత్ తోకముడిచి క్షమాపణ చెప్పాల్సివచ్చింది.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.
తనను ‘గాడిద’ అంటూ రేవంత్ తిట్టడంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘ఆయన తన మూలాలను గుర్తుచేసుకొంటూ, సోదర భావాలను వ్యక్తంచేశారేమో’ అని రేవంత్ను పరోక్షంగా గాడిద సంతతితో పోల్చి ట్విట్టర్ వేదికగా చురకలేశారు. ఐటీ రంగంపై పార్లమెంట్ నియమించిన శశిథరూర్ సారథ్యంలోని స్థాయీసంఘం ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి, ఇం దుకు మంత్రి కేటీఆర్ చేసిన కృషికి శశిథరూర్ ఫిదా అయిపోయారు. పలుమార్లు నేరుగానే కేటీఆర్ను అభినందించారు.
కానీ, శశిథరూర్ మంత్రి కేటీఆర్ను, రాష్ట్ర అభివృద్ధిని మెచ్చుకోవడం రేవంత్ జీర్ణించుకోలేకపోయారు. మంగళవారం గాంధీభవన్లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ‘ఇక్కడ ఏం జరుగుతుందో ఆ బేవకూఫ్కు తెలిసుండాలి.. నాలుగు ఇంగ్లిష్ ముక్కలు వచ్చినంత మాత్రాన అదేదో గొప్ప కాదు.. అది కమ్యునికేషన్ స్కిల్ మాత్ర మే. నా దృష్టిలో అతడో గాడిద.. ఇలాంటి వాళ్ల ను పార్టీ నుంచి బహిష్కరించాలి’ అంటూ శశిథరూర్పై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలుచేస్తూ విరుచుకుపడ్డారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంగ్ల దినపత్రిక ప్రచురించడం సంచలనంగా మారింది.