నిన్నటికి నిన్న రాజకీయ కురువృద్ధుడైన ఒక నేత.. అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించిన ఓ కుర్రాడి చేతిలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది!అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించిన ఓ కుర్రాడి చేతిలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది! వారసత్వ రాజకీయాన్ని ఘనంగా చాటుకునే మరో నాయకుడు.. ఓ విద్యార్థి నేతకు లభించిన ప్రజామద్దతు ముందు తలొంచాల్సి వచ్చింది! రాజకీయాల్లో ఢక్కాముక్కీలు తిన్న అనేకమంది.. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినవారి ముందు డీలాపడిన సందర్భాలెన్నో!
ఒకప్పుడు పెద్దపల్లిలో, ఆ తర్వాత అందోల్లో, నిన్నటికి నిన్న నాగార్జునసాగర్లో కనిపించిన దృశ్యమే ఇప్పుడూ రిపీట్ కాబోతున్నది! అసాధ్యాలను సుసాధ్యంచేసే ముఖ్యమంత్రి కేసీఆర్.. గులాబీ రేసు గుర్రాలను ఎంపిక చేయడంలో వ్యూహం, చతురత అద్భుతాలు చేస్తున్నది! ఏండ్ల తరబడి కట్టుకున్న స్వార్థ రాజకీయ కోటలను బద్దలు కొడుతున్నది! ఇవాళ హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ మరో రికార్డును టీఆర్ఎస్ బద్దలు కొట్టబోతున్నది.
మొన్న ఒక బాల్కసుమన్.. నిన్న ఒక నోముల భగత్.. ఇప్పుడు గెల్లు శ్రీనివాస్యాదవ్! తెలంగాణ రాజకీయాల్లో తమకు ఎదురేలేదని.. తమ కోటల్ని ఎవరూ ఛేదించజాలరని అతివిశ్వాసంతో రెచ్చిపోయిన హేమాహేమీలెందరో.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విసిరిన తురుపుముక్కలకు కుదేలైపోయారు. ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్నవారు అత్యంత పేదరికం నుంచి వచ్చిన వారి చేతిలో పరాభవాన్ని చవిచూశారు. రిజర్వేషన్లు లేని జనరల్ స్థానాల్లోనూ.. బలహీనవర్గాల అభ్యర్థులను బరిలోకి దింపి అద్భుత విజయాన్ని సాధించారు. దశాబ్దాల తరబడి ఓటమే ఎరుగని ఎందరో.. మొట్టమొదటిసారి ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చిన పసికూనల చేతిలో విలవిల్లాడిపోయారు. తమదే సామ్రాజ్యం అని గొప్పలు చెప్పుకొన్న ఎందరినో.. సీఎం కేసీఆర్.. రాజకీయ ఓనమాలు కూడా నేర్వని వాళ్లను పోటీగా దింపి సునాయాసంగా గెలిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను హుజూరాబాద్ ఉపఎన్నికల బరిలో దింపి మరొక అద్భుతాన్ని సృష్టించబోతున్నారు.
ఎదురులేని గులాబీ
ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నికలో యువకుడు నోముల భగత్కు టికెట్ ఇచ్చి.. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ‘కుంజర యూధంబు.. దోమ కుత్తుక జొచ్చెన్’ అనే పరిస్థితి కల్పించారు. టీఆర్ఎస్కున్న ప్రజాబలం.. అధినేత కేసీఆర్ నిర్ణయాలకు ప్రత్యర్థులు బెంబేలెత్తి మట్టికరచిన సందర్భాలు అనేకం. ఆ జాబితాలో మొన్న వివేక్.. నిన్న జానారెడ్డి చేరితే.. రేపు ఈటల వంతు ఖాయమన్న చర్చ సర్వత్రా వినిపిస్తున్నది. టీఆర్ఎస్ ఎవరిని అభ్యర్థిగా బరిలో దించినా ప్రజలు ఆదరిస్తారని పెద్దపల్లి ఎంపీగా సీనియర్ నాయకుడైన వివేక్పై బాల్కసుమన్ గెలుపు, సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డిపై భగత్ విజయం నిరూపించినట్టే రేపు అక్టోబర్ 30న హుజూరాబాద్లో జరిగే ఉపఎన్నిక కూడా ఇదేవిధంగా చరిత్రాత్మకం కాబోతున్నదనే వాతావరణం ఇప్పటికే ఆవిష్కృతమైంది. ఒకనాడు తెలంగాణవాదానికి ప్రజల్లో అంతగా ఆదరణ లేదని దుష్ప్రచారాలు చేసిన సందర్భంలో మంత్రుల మీదే పోటీకి నిలబెట్టి వాళ్లను మట్టి కరిపించారు కేసీఆర్. 2014, 2015, 2018 సాధారణ ఎన్నికల సందర్భంలోనూ అదే చరిత్ర పునరావృతమైంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్ మంత్రివర్గాల్లో తిరుగులేని మంత్రులుగా చెలామణి అయిన ఎంతోమందిని పైసకు చెల్లకుండా చేశారని టీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
జీరోలుగా మారిన సూపర్ హీరోలు
2014 సాధారణ ఎన్నికల సమయమది.. కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న పెద్దపల్లి లోక్సభ స్థానం. ఆరుసార్లు ఎంపీగా గెలిచి, అనేక కేంద్రమంత్రి పదవులను చేపట్టిన కాకా జీ వెంకటస్వామి ఆ నియోజకవర్గాన్ని శాసించారు. ఆనంతరం ఆయన కొడుకు వివేక్ అదే కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అలాంటి కీలకమైన స్థానంలో సీఎం కేసీఆర్.. అప్పటిదాకా రాజకీయ ఓనమాలు కూడా తెలియని విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ను బరిలో దింపారు. కేసీఆర్ నిర్ణయాన్ని ఆమోదించిన పెద్దపల్లి ప్రజలు సుమన్ను 2.94 లక్షల మెజార్టీతో గెలిపించారు. 2015 వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో.. కేంద్రమంత్రిగా పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సర్వే సత్యనారాయణపై అప్పటిదాకా కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయని పసునూరి దయాకర్ను పోటీలోకి దింపితే టీఆర్ఎస్కు నాలుగున్నర లక్షల రికార్డుస్థాయి మెజార్టీ వచ్చింది.
అది దేశంలోనే ఏడో అత్యధిక మెజార్టీ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎందరో హేమాహేమీలు కేసీఆర్ వ్యూహాలకు కుప్పకూలారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ (అందోల్)పై జర్నలిస్ట్ చంటి క్రాంతికిరణ్ను, గద్వాలలో మాజీ మంత్రి డీకే అరుణపై కృష్ణమోహన్రెడ్డిని, జహీరాబాద్లో మాజీ మంత్రి గీతారెడ్డిపై మాణిక్రావును, మునుగోడులో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై కంచర్ల భూపాల్రెడ్డిని, జగిత్యాలలో జీవన్రెడ్డిపై డాక్టర్ సంజయ్ని, మాజీ మంత్రి, తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని, కొడంగల్లో రేవంత్రెడ్డిపై పట్నం నరేందర్ను, హుజూర్నగర్లో పద్మావతి ఉత్తమ్పై శానంపూడి సైదిరెడ్డిని, ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై ఆయన సొంత నియోజకవర్గం అంబర్పేటలో కాలేరు వెంకటేశ్ను, వికారాబాద్లో మాజీ మంత్రి ప్రసాదరావుపై మెతుకు ఆనంద్ మొదలైనవారిని బరిలో దింపి దిగ్గజాల కంచుకోటల్ని టీఆర్ఎస్ బద్దలు కొట్టింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి పునరావృతమై వస్తున్నది. సీఎం కేసీఆర్ ఎత్తుగడలకు ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని వీవీఐపీలుగా చెలామణి అయిన ఎంతోమంది రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈటల ఇంటికెళ్లుడే
హుజూరాబాద్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ వ్యూహాన్నే అనుసరించారు. నిరుపేద యాదవ కుటుంబానికి చెందిన విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్యాదవ్ను బరిలో దింపారు. టీఆర్ఎస్సే తమ అభ్యర్థి, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే తమకు శ్రీరామరక్ష అని హుజూరాబాద్ ప్రజలు నిర్ధారణకు వచ్చారని గులాబీ శ్రేణులంటున్నాయి. తాము టీఆర్ఎస్నే గెలిపించుకుంటామని, ఈటలను ఇంటికి పంపిస్తామని ప్రజలు బాహాటంగానే తీర్మానిస్తున్నారు. అభ్యర్థిగా గెల్లును సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటినుంచే ఈటల ఇంటికెళ్లుడు ఖాయమనే వాతావరణం నెలకొన్నది. వేల ఎకరాలున్న వ్యక్తి కావాలా? 2 గుంటల భూమి ఉన్న సామాన్యుడు కావాలా? అంటే సామాన్యుడే మాకు మాన్యుడంటున్నారు. సీఎం కేసీఆర్ అవకాశమిస్తేనే ఈటల ఎదిగారని, ఇప్పుడు తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం బీజేపీలో చేరిన ఈటలకు ఓటెందుకు వేస్తామని కుండబద్దలు కొడుతున్నారు. సీఎంవ్యూహానికి ఈటల ఇంటికిపోవటం.. గెల్లు అసెంబ్లీకి రావడం ఖాయమని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.