తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ వైద్యరంగానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. మారుమూల ప్రాంతాల్లోని చిన్నచిన్న దవాఖానల్లోనూ అనేక వసతులు కల్పించారు. కానీ, ఈటల రాజేందర్ ఆరోగ్యమంత్రిగా ఉండికూడా వీణవంక పీహెచ్సీని ఏరియా దవాఖానగా మార్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇటీవల మంత్రి హరీశ్రావు చొరవతో సీఎం కేసీఆర్ వీణవంక పీహెచ్సీని ఏరియా దవాఖానగా మార్చారు.
వీణవంకలో చాలాఏండ్ల క్రితమే ఏరియా దవాఖాన ఉండేది. ఆపద సమయంలో వైద్య సేవలు అందించడంతోపాటు పోస్టుమార్టం ప్రక్రియ ఇక్కడ జరిగేది. 2004లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం వీణవంక దవాఖానను ఏరియా స్థాయి నుంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తగ్గించింది. తెలంగాణ ఏర్పడ్డాక పరిస్థితి మారుతుందని ఇక్కడి ప్రజలు భావించారు. దవాఖానను అప్గ్రేడ్ చేయించాలని మంత్రిగా ఉన్న ఈటలను పలుసార్లు కోరారు.
2019లో వైద్య, ఆరోగ్యశాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో.. తమ ఊరిలోని దవాఖాన పరిస్థితి మారుతుందని పేదలు ఆశించారు. కానీ, మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేసేదాక ఈటల వీణవంక దవాఖానను పట్టించుకోలేదు. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక.. టీఆర్ఎస్ శ్రేణుల నుంచి సమాచారం తెలుసుకున్న హరీశ్రావు.. విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆదేశాలతో దవాఖాన పూర్వస్థాయికి చేరుకున్నది. వైద్య, ఆరోగ్యమంత్రిగా ఉన్నా ఈటల చేయలేదని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన రోజే పని పూర్తయ్యిందని వీణవంకపేదలు అంటున్నారు. మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.