హుజూరాబాద్ గులాబీ పార్టీకి కంచుకోట. టీఆర్ఎస్కు విజయాల పూలబాట. ఆవిర్భావం రోజుల నుంచి హుజూరాబాద్ అండగా నిలవడం మరువలేదు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమపార్టీతో ఇక్కడి ప్రజానీకం మమేకమవుతున్నది. రాష్ట్రంలో, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హుజూరాబాద్ ఓటర్లు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇస్తూ వస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దళపతి కేసీఆర్కు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అండగా ఉంటున్నారు. ఎన్నిక ఏదైనా గులాబీ పార్టీకే జైకొడుతున్నారు. 2001లో స్థానిక సంస్థల ఎన్నికలతో మొదలైన టీఆర్ఎస్ గెలుపు బావుటా అప్రతిహతంగా సాగుతూనే ఉన్నది. లోక్సభ, అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్.. ఇలా ఎన్నిక ఏదైనా అత్యధిక స్థానాలు టీఆర్ఎస్కే దక్కుతున్నాయి. హుజూరాబాద్ ఏ ఎన్నికల్లోనూ బీజేపీ ఉనికి చాటుకునే స్థాయిలో బలం చూపలేదు. కరీంనగర్ లోక్సభ స్థానాన్ని గెలుచుకున్న సందర్భాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్కు హుజూరాబాద్లో ఆధిక్యం దక్కకపోవడం విశేషం. లోక్సభ ఎన్నిక తుది ఫలితం ఎలా ఉన్నా హుజూరాబాద్లో ప్రతిసారి టీఆర్ఎస్ వెంటే ప్రజలు ఉంటున్నారు. మంత్రి పదవిలో ఉండి భూకబ్జాకు పాల్పడిన కారణంగా పదవి కోల్పోయి ప్రస్తుత ఎన్నికల్లో ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న బీజేపీకి హుజూరాబాద్లో ఏమాత్రం బలం లేదు. ఇక్కడి ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ కాషాయ పార్టీని దగ్గరికి రానీయలేదు.
ఎన్నికేదైనా ఆధిక్యతే
హుజూరాబాద్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఆ ఏడు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీఆర్ఎస్సే గెలుచుకున్నది. కరీంనగర్ లోక్సభ స్థానం లో కాంగ్రెస్ విజయం సాధించింది. లోక్సభ ఎన్నికల్లోనూ హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో టీఆర్ఎస్కే ఆధిక్యం వచ్చింది. 2014 సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ, కరీంనగర్ లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. లోక్సభ ఎన్నికలోనూ హుజూరాబాద్ సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్కు భారీ ఆధిక్యత వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు మరోసారి టీఆర్ఎస్కు ఘన విజయం అందించారు. 2019లో కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీ గెలిచింది. ఈ ఎన్నికలోనూ హుజూరాబాద్లో టీఆర్ఎస్కు భారీ ఆధిక్యం వచ్చింది. 2009, 2019 సాధారణ ఎన్నికల్లో ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ గెలిచినా హుజూరాబాద్లో టీఆర్ఎస్కే ప్రజలు మద్దతు ఇచ్చారు. 2004లోనూ అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్కు ఘనవిజయం దక్కింది.