తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్ ఇంజిన్లుగా మారాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన, సమ్మిళితమైన, సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నామని చెప్పారు. 75 ఏండ్ల చరిత్రలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, కుటీరపరిశ్రమలు, ఐటీరంగాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. శాసనసభలో గురువారం పట్టణప్రగతిపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడిన తర్వాత మంత్రి కేటీఆర్ సమాధానాలిచ్చారు. పట్టణాలు, నగరాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సభకు వివరించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..
నగరాలు నవచైతన్యంతో నగారాలు మోగిస్తున్నాయి. రాజకీయ రంగుటద్దాల్లోంచి వేరుచేసి చూడకుండా అన్ని ప్రాంతాల్లో సమతుల అభివృద్ధిని సజావుగా సాగిస్తున్నాం. నడిబొడ్డు, మారుమూల అనే తేడాలు చెరిపేస్తున్నాం. సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ చిరునామాగా మారుతున్నది. చెత్తసమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నాం. నిన్నటి డొక్కుబండ్లు పోయి బెంజి ట్రక్కులు వచ్చాయి. కాదేదీ అనర్హం అన్నట్టు వ్యర్థాల నుంచి సంపద సృష్టి జరుగుతున్నది. అంతిమసంస్కారాలు సంస్కారవంతంగా జరగాలని వైకుంఠధామాలు నెలకొల్పుతున్నాం. తోటలు కోల్పోయి బోసిగా మారిన భాగ్యనగరాన్ని ట్రీసిటీగా నిలబెట్టాం. పచ్చదనం పరుచుకుంటుంటే సంక్షేమానికి బాటలు వేస్తున్నాం. అర్బన్ మిషన్ భగీరథతో మంచినీటి సరఫరా మెరుగుపడింది. మార్కెట్లు, పార్కులు.. రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు అంతటా కొత్తదనం కనిపిస్తున్నది. ఎంతో చేశాం. అయినా చేయాల్సింది ఇంకా ఎంతో ఉన్నదని వినమ్రంగా మనవి చేస్తున్నాం. విపక్షాల కంటికి ఈ అభివృద్ధి కనిపించడం లేదు. కారణం.. వాళ్లు దీన్ని చూడాలనుకోవడం లేదు. వాళ్లు కండ్లు తెరిచి చూడాలి. ఈ అభివృద్ధి అంతా విపక్షాల కండ్లకు స్పష్టంగా కనబడాలనే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల పైచిలుకు ఎల్ఈడీ బల్బులు పెట్టించినం. వారి కంటిచూపు బాగుపడాలని, వారు ప్రగతిని చూడాలని కోరుకుంటున్నాం.
తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 1.12 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో పట్టణ విస్తీర్ణం మూడు శాతమే. అత్యధిక జనాభా అక్కడే నివసిస్తున్నారు. 65-70% జీఎస్డీపీ పట్టణాల నుంచే వస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పురపాలికల సంఖ్య 68 నుంచి 142కు, వార్డుల సంఖ్య 2,369 నుంచి 3,618కు పెరిగింది. టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.2 వేల కోట్ల లక్ష్యానికి మించి రూ. 3 వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, రాందేవ్గూడల్లో రోడ్లు, పచ్చదనం, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుచేశాం. ప్రతిపక్ష సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర, మంథని, మునుగోడు, చండూరు, దుబ్బాక అన్న వ్యత్యాసం లేకుండా అన్ని నగరాల అభివృద్ధికి నిధులు ఖర్చుపెడుతున్నాం. గ్రీన్ బడ్జెట్గా 10 శాతం కేటాయిస్తున్నాం. గ్రీన్ యాక్షన్ ప్లాన్ అమలుచేస్తున్నాం.
ఎస్సార్డీపీ ద్వారా రూ.6 వేల కోట్లతో 24 అండర్పాస్లు, ైప్లెఓవర్లు నిర్మించాం. సీఆర్ఎంపీ కింద రూ.1,829 కోట్లతో 724 కిలోమీటర్ల రోడ్లను నిర్మించి, నిర్వహిస్తున్నాం. హెచ్చార్డీసీఎల్ ద్వారా 132 లింకురోడ్లుకు గాను 108 నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే 24 రోడ్ల పనులను పూర్తిచేశాం.
కోకాపేటతో కొత్త నగరం మొదటిదశలో రూ.858 కోట్లతో నాలాలను పటిష్టంచేస్తున్నాం. రూ.387 కోట్లతో బాలానగర్ ైప్లెఓవర్ను పూర్తిచేశాం. కోకాపేటలో 530 ఎకరాల్లో రూ.265 కోట్లతో కొత్తనగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మంగళ్పల్లి, బాటసింగారం లాజిస్టిక్ పార్కులు అందుబాటులోకి తీసుకొచ్చాం. మరో 10-12 పార్కులను త్వరలోనే తీసుకొస్తాం. చెరువుల పరిరక్షణకు ప్రత్యేకంగా కమిషనర్ను నియమిస్తున్నాం. మాస్టర్ప్లాన్ త యారుచేస్తున్నాం. వందేండ్ల గండిపేట చెరువును రూ.36.5 కోట్లతో అభివృద్ధిచేస్తున్నాం. ఓఆర్ఆర్ చుట్టూతా ఎల్ఈడీలైట్లు, రూ.387 కోట్లతో సర్వీసు రోడ్లను విస్తరింపజేస్తున్నాం.
ట్యాంకర్ల వద్ద మంచినీటి యుద్ధాలకు తెరదించి, ఎండిన ప్రతి గొంతును తడుపుతున్నాం. అర్బన్ మిషన్ భగీరథలో రూ.5,378 కోట్లు, జీహెచ్ఎంసీలో విలీన మున్సిపాలిటీల్లో రూ.3,285 కోట్లతో ఇంటింటికి తాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నాం. మిగిలిపోయిన కాలనీలకు నీళ్లందించేందకు రూ.1,200 కోట్లు మంజూరుచేశాం. రూ. 4,700 కోట్లతో కేశవాపూర్ రిజర్వాయర్, రూ.1,450 కోట్లతో సుంకిశాల నుంచి మరో పైపులైన్ నిర్మాణం చేపడుతున్నాం. గత ప్రభుత్వాలు పాలించిన 65 ఏండ్లల్లో 11.40 లక్షల కనెక్షన్లు ఉంటే కొత్తగా 13.45 కనెక్షన్లు ఇవ్వబోతున్నాం. పేదవారికి రూపాయికి, మిగతా వారికి రూ.100కు కనెక్షన్ ఇస్తున్నాం. గతంలో రోజుకు 340 ఎంజీడీలు సరఫరా చేస్తే, టీఆర్ఎస్ పాలనలో రోజుకు 602 ఎంజీడీలు సరఫరా చేస్తున్నాం. గత ప్రభుత్వాలతో పొల్చితే 77 శాతం మెరుగ్గా నీళ్లిస్తున్నాం. 20 వేల లీటర్ల వరకు పేదవారికి ఉచితంగా నీళ్లిస్తున్నాం. 24/ 7 నీళ్లిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
ప్రతి వెయ్యిమందికి ఒకటి చొప్పున 10వేల టాయిలెట్లు నిర్మించాం. వివిధ పట్టణాల్లో 37లక్షల చెత్తబుట్టలు, హైదరాబాద్లో తడిచెత్త, పొడిచెత్త సేకరణ కోసం 44 లక్షల చెత్తబుట్టలు అందజేశాం. బెంజ్ వాహనాలంటే సంపన్నులు వాడతారన్న పేరున్నది. అదే బెంజ్ వాహనాలను చెత్త రవాణా కోసం రెఫ్యూజ్ కాంప్యాక్టర్లు పేరుతో వినియోగిస్తున్నాం. ఇలాంటి వాహనాలు 82 తీసుకొచ్చాం. మరో 70కి పైగా తీసుకొస్తాం. జీహెచ్ఎంసీలో గతంలో 3,400 టన్నుల చెత్తసేకరణ జరిగేది. ఇప్పుడు 6,500 టన్నులు సేకరిస్తున్నాం. చెత్తరవాణాలో డొక్కుబండ్ల స్థానంలో బెంజ్ ట్రక్కులు తీసుకొస్తున్నాం. కొత్తగా 2,200 స్వచ్ఛ ఆటో టిప్పర్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. మరో 150 సెకండరీ కలెక్షన్ పాయింట్లు పెడుతున్నాం.
చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం. ఇందుకోసం కొత్త డ్రై రీసోర్స్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నాం. వీటిని 61 నుంచి 206కు పెంచినం. కంపోస్ట్ షెడ్లు గతంలో 40 ఉంటే ఇప్పుడు 224 ఏర్పాటయ్యాయి. ఎరువులు తయారీచేసి రైతులకు విక్రయిస్తున్నాం. భువనగిరి, సూర్యాపేటలో మహిళా సంఘాలకు డబ్బులొస్తున్నాయి. మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరుతున్నది. వేస్ట్ టు వెల్త్ సృష్టించవచ్చని తెలంగాణ నిరూపిస్తున్నది.
దేశంలో ఏ రాష్ట్రంలో చేయనివిధంగా 100శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లో ఉత్పత్తయ్యే 1,600 ఎంఎల్డీల మురుగునీటి నిర్వహణ కోసం రూ.3,866 కోట్లు విడుదల చేశాం. హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నది. నిర్మాణ వ్యర్థాల నిర్వహణలో భాగంగా ఫతుల్లగూడ, జీడిమెట్లలో ఒక్కోటి 500 టన్నుల సామర్థ్యం గల రెండు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటుచేశాం. దీంతో మళ్లీ నిర్మాణ సామగ్రిని ఉత్పత్తిచేసే వీలుంది. దక్షిణాదిలోనే అతిపెద్ద తొలి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను జవహర్నగర్లో ఏర్పాటుచేశాం. ఇందులో ఇప్పటికే 20 మెగావాట్ల ప్లాంటును ప్రారంభించగా, మరో 20 మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంటుకు కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు మంజూరుచేసింది. త్వరలో ఏర్పాటుచేయబోతున్నాం. దిండిగల్లో మరో 15 మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంటును ఏర్పాటు చేయబోతున్నాం. తడి చెత్తనుంచి ఎరువు, పొడిచెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయబోతున్నాం. వ్యర్థాలను జీరో చేసేందుకు కృషిచేస్తున్నాం.
మన కార్యక్రమాలకు దేశ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. అనేక అవార్డులొచ్చాయి. పీఎం స్వనిధిలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. లక్షకన్నా తక్కువ జనాభా క్యాటగిరీలో టాప్టెన్ టౌన్లన్నీ మనవే. ప్రధాన నగరాల క్యాటగిరీలో టాప్టెన్లో మూడు మన రాష్ట్రం నుంచి ఉన్నాయి. 40 లక్షలపైన జనాభా ఉండే నగరాల క్యాటగిరీలో జీహెచ్ఎంసీ మొదటి స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్, ఆర్బీఐ కితాబిచ్చాయి. ప్రపంచబ్యాంకు హైదరాబాద్ను ఓడీఎఫ్++గా మాత్రమే కాకుండా వాటర్+ నగరంగా కూడా గుర్తించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపు అవార్డులు లభించాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అవార్డ్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు-2020 ఇచ్చారు. హడ్కో అవార్డు 2018, 2020లో వచ్చింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఏజెన్సీ హార్బర్డే ఫౌండేషన్ హరితహారం వల్ల హైదరాబాద్ దేశంలోనే ఏకైక ట్రీసిటీగా గుర్తింపు సాధించినట్టు ప్రశంసించింది. మర్సర్ సంస్థ ఐదేండ్లుగా వరుసగా క్వాలిటీ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ బెస్ట్ సిటీగా నిలిచింది
ఇంతటితో అయిపోలేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మేము పేర్కొన్నవి వాస్తవాలు. రోమ్ నగరం ఒకేరోజులో నిర్మాణం కాలేదు. హైదరాబాద్ విషయానికొస్తే, మూడు శాతం భౌగోళిక విస్తీర్ణంలోనే దాదాపు 45 శాతం జనాభా ఉన్నప్పుడు మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పడుతుంది. ఎప్పటికప్పుడు వాటిని విస్తరించుకోవడం అవసరం. ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం.
కొవిడ్ సమయంలో కార్మికుల సంక్షేమంలో భాగంగా మున్సిపల్ సిబ్బందికి జీహెచ్ఎంసీ పరిధిలో రూ.7,500 చొప్పున, ఇతర పురపాలక సంఘాల్లో రూ. 5,000 చొప్పున మొత్తం రూ.71.38 కోట్లు ప్రత్యేక ప్రోత్సాహం కింద 54,776మంది కార్మికులకు అందించాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్కో కార్మికుడికి వర్కర్ వెల్ఫేర్ కింద రూ.4,800 విలువైన కిట్లను అందించాం. బూట్లు, ఇతర అన్ని పరికరాలు కిట్లో ఉంటాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.11కోట్లు, ఇతర మున్సిపాలిటీల్లో మరో రూ.7-8కోట్లు దీనికోసం ఖర్చుచేశాం. రూ.12,000ల కు తగ్గకుండా ప్రతినెలా వేతనాలు అందిస్తున్నాం. గతంలో రూ.7,000-8,000 ఇస్తూ శ్రమదోపిడీ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాం. దీంతో కార్మిక సంఘాలకు పనిలేకుండా పోయింది.
రాష్ట్రం ఏర్పడగానే కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటుచేసి, తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చిన దార్శనికుడు సీఎం కేసీఆర్. పల్లెప్రగతితో మారుమూల గ్రామాల్లోనూ అభివృద్ధి కనిపిస్తున్నది. నెలకు రూ.309 కోట్లు చొప్పున విడుదలచేసి, గ్రామాలను తీర్చిదిద్దుకుంటున్నాం. హరితహారంలో భాగంగా అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటుచేసుకొన్నాం.
పట్టణీకరణలో తెలంగాణది 5వ స్థానం
పట్టణప్రగతి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక వినూత్నమైన, చట్టబద్ధ కార్యక్రమం. పట్టణాల్లో జీవన ప్రమాణాలు పెంపుదల, పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిచ్చాం. పట్టణీకరణలో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది.
-రోహిత్రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే
పట్టణ ప్రాంతాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం 7 కొత్త కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు ఏర్పాటుచేసింది. మున్సిపల్శాఖ ప్రణాళికలతో ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మిషన్ భగీరథ కింద కొత్త కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు తాగునీరు అందుతున్నది. హైదరాబాద్లో ఇంటింటికీ 20 వేల లీటర్ల తాగునీరు ఉచితంగా ఇవ్వడం గొప్ప నిర్ణయం. నోటరైజ్డ్ డాక్యుమెంట్లు ఉన్న ఇండ్లకూ నీరు ఇచ్చేలా చూడాలి. గ్రామాల్లో వైకుంఠధామాలతోపాటు ఖబరస్థాన్లను నిర్మించాలి. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ సమస్యలను పరిష్కరించాలి. వక్ఫ్బోర్డు ఆస్తుల పరిరక్షణపై సీబీఐ, సీఐడీ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
-మోజంఖాన్, బహదూర్పురా ఎమ్మెల్యే
రోజువారీ మంచినీటి సరఫరా ఇలా తెలంగాణ ఏర్పాటుకు ముందు
340 ఎంజీడీలు టీఆర్ఎస్ పాలనలో..
602 ఎంజీడీలు 65 ఏండ్లలో ఇచ్చిన
మంచినీటి కనెక్షన్లు 11.40 లక్షలు
పట్టణాల్లో నిర్మించిన టాయిలెట్లు 10,000
హైదరాబాద్లో పంపిణీచేసిన చెత్తబుట్టలు: 44లక్షలు
ఇతర పట్టణాల్లో పంపిణీచేసినవి: 37 లక్షలు
చెత్త సేకరణకు వినియోగిస్తున్న బెంజ్ వాహనాలు: 82
స్వచ్ఛ ఆటో టిప్పర్ల సంఖ్య: 2,200