మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతగా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా చిరంజీవి తన అభిమానిపై చూపిన దాతృత్వం మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ ట్విట్టర్ ద్వారా చిరంజీవిని కలవాలని ఆయనతో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. తన ఆరోగ్యం అంతగా బాగుండడం లేదని, మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా చిరంజీవిని వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద చిరంజీవి వెంటనే స్పందించి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వాకబు చేసి వెంటనే తనను కలవాల్సిందిగా కోరారు.
కానీ వెంకట్ కదలలేని పరిస్థితుల్లో ఉన్నారని చిరంజీవి దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో చిరంజీవి ఎలాగయినా వెంకట్ ను కలవాలనే ఉద్దేశంతో వెంకట్, వెంకట్ భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్స్ పంపించి హైదరాబాద్ రప్పించారు. ఈ శనివారం చిరంజీవి.. వెంకట్, ఆయన భార్య సుజాతను తన నివాసంలో కలిశారు. ఇద్దరితో దాదాపు 45 నిమిషాల సమయం కూడా గడిపారు. చిరంజీవి కూలంకషంగా వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన చిరంజీవి, మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్స్ లో చెకప్ కోసం పంపించారు.
ఒమేగా హాస్పిటల్స్ లో తెలిసిన డాక్టర్లతో మాట్లాడిన చిరంజీవి పరిస్థితి అడిగి తెల్సుకున్నారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి, అక్కడి వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతం అయిన విశాఖపట్నంలో హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్ లో ఖర్చలు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన వీరాభిమాని వెంకట్ ను కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకట్, ఆయన భార్య సుజాతకు భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు అందరూ మెగాస్టార్ మంచి మనసు తమకు తెలుసని, అది మరోసారి ప్రూవ్ అయింది అని చెబుతున్నారు. వెంకట్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషి అవ్వాలని మెగా అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.