హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూసిన బీజేపీ అసలు స్వరూపాన్ని టీఆర్ఎస్ బయట పెట్టింది. కమలం పార్టీకి హుజూరాబాద్ ప్రజలు ఓటు ఎందుకెయ్యాలో చెప్పాలని ఎన్నిసార్లు డిమాండ్చేసినా ముఖం చాటేసింది. మంత్రి హరీశ్రావు ఎన్ని సవాళ్లు విసిరినా సమాధానం చెప్పకుండా ఆ పార్టీ నాయకులు పరారయ్యారు. విచిత్రం ఏమిటంటే.. ఏ ఒక్క సవాల్కు కాషాయం పార్టీ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో కమలం పార్టీ నాయకుల మాటలన్నీ అబద్ధాలేనని స్పష్టమవుతున్నది.
గ్యాస్పై పన్ను రుజువు చేస్తవా..
తప్పుకుంటవా? 12 అక్టోబర్ 2021
బీజేపీ నేత ఈటల పచ్చి అబద్ధాలు చెప్తున్నడు. గ్యాస్ సిలిండర్ ధరలో రూ.291 రాష్ట్ర పన్ను ఉన్నదని ప్రచారం చేస్తున్నడు. ధరలు పెంచిన విషయాన్ని చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే రాజకీయం చేస్తున్నడు. హుజూరాబాద్ వేదికగా నేను సవాల్ చేస్తున్న. గ్యాస్ సిలిండర్ ధరలో రూ.291 రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉన్నదని నిరూపిస్తే రాజీనామా చేస్త. నిరూపించకపోతే నువ్వు ఉపఎన్నిక నుంచి తప్పకుంటవా? ఈ విషయంపై చర్చకు ఈ రోజు రావాలా? రేపు రావాలా? జమ్మికుంట గాంధీ బొమ్మకాడికి రమ్మంటవా? లేదా హుజూరాబాద్ అంబేద్కర్ బొమ్మకాడికి రమ్మంటవా? మీరు చెప్పండి.
- ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట్లో ఆర్ఎంపీ, పీఎంపీలతో భేటీలో హరీశ్ రావు
దగ్గరుండి దళితబంధు గ్రౌండింగ్
చేయిస్త 25.10.2021
ప్రతిపక్షాలు అవాకులు.. చెవాకులు పేలుతున్నయ్. అసత్య ప్రచారాలు చేస్తున్నయ్.
దళితబంధుపై ఎలాంటి అపోహలు వద్దు. మీరు అడగకున్నా మీ బతుకుల బాగు కోసం సీఎం కేసీఆర్ ఈ పథకం తెచ్చిండు.
దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే ఆయన సంకల్పం. అలాంటి పథకాన్ని ఎట్ల ఆపుతం?. ఆరు నూరైనా కొనసాగిస్తం. ఎన్నికలైన తర్వాత నేనే దగ్గరుండి లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేయిస్త. లేకపోతే నా పేరు మార్చుకుంట. దీనిపై ఏ చర్చకైనా సిద్ధం అని సవాలుచేస్తున్న.
- ఇల్లందకుంటలోని దళితవాడలో హరీశ్రావు
ధరలు తగ్గిస్తామని చెప్పి
కిషన్రెడ్డి ఓట్లడుగాలె 25.10.2021
బీజేపీ ప్రజలపై ధరల భారం మోపాలని చూస్తున్నది. ఎన్నికల తెల్లారే సిలిండర్ ధర రూ.200 పెంచి రూ. 1,200 చేస్తది. ఏడాదిలోగా రూ.2 వేలకు తీస్కపోతది. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు. ఇక ముందు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచబోమని బీజేపీ నేతలు మాట ఇస్తరా? హుజూరాబాద్లో తిరుగుతున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి ధరలు తగ్గిస్తామని, భవిష్యత్తులో పెంచబోమని చెపుతారా? ఈ సవాలుకు జవాబు చెప్పి ఓట్లడగాలె.
- వీణవంకలో మంత్రి హరీశ్రావు
కిషన్రెడ్డీ.. ధరలపై ఎక్కడ కూసుందామో చెప్పు
23.10.2021
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నడు. పెట్రోల్, డీజిల్ ధరల మీద చర్చకు వస్తే.. రాష్ట్ర మంత్రిగా నేను కూడా సిద్ధం. ఎక్కడికి రావాల్నో చెప్పాలె. ఈ ధరల పెంపు పాపంలో ఎవరి భాగమెంతో తేలిపోతుంది. మొన్న ఈటలను రమ్మంటే పదిరోజులైనా రాలె. నువ్వైనా అదేంటో నిరూపించు.
- జమ్మికుంటలో హరీశ్రావు
ఈ పదిహేను ప్రశ్నలకు జవాబిచ్చి ఓట్లడగాలె- 23.10.2021
రైతుల ఉసురు పోసుకుంటున్న బీజేపీకి ఓటెందుకు వెయ్యాలో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని మంత్రి హరీశ్రావు డిమాండ్చేశారు. ఆ మేరకు 15 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను విడుదలచేశారు. కానీ వేటికీ సమాధానం చెప్పలేదు. మంత్రి హరీశ్ సంధించిన ప్రశ్నలివీ..
- రైతులను నడి రోడ్డు మీద చంపినందుకు మీకు ఓటెయ్యాలా?
- రైతులను కర్రలతో కొట్టండని పిలుపునిచ్చినందుకు బీజేపీకి ఓటెయ్యాలా?
- రైతులను ఖలిస్థాన్ ఉగ్రవాదులతో పోల్చినందుకు ఓటెయ్యాలా?
- వ్యవసాయ మారెట్లు బంద్ పెట్టేందుకు కొత్త చట్టాలు తెచ్చినందుకా?
- ఉచిత విద్యుత్తు ఇవ్వకుండా బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టాలని చట్టం తెచ్చినందుకా?
- పెట్రోల్ లీటరు ధర అడ్డగోలుగా పెంచినందుకా? (ఓ కేంద్ర మంత్రి 95% మందికి పెట్రోల్, డీజిల్ ధరలతో పని లేదంటున్నడు. ఎంత దారుణం!)
- డీజిల్ రేట్లు పెంచటంతో వ్యవసాయ ఖర్చు పెరిగింది. గతంలో ట్రాక్టర్తో దున్నడానికి రూ.3 వేలు ఖర్చు కాగా, ఇప్పుడు రూ.6 వేలు అవుతున్నది. సాగు ఖర్చు రెండింతలు పెంచినందుకు బీజేపీకి ఓటెయ్యాలా?
- రైతుబంధు, రైతుబీమాలో ఒక్క రూపాయైనా కేంద్రానిది ఉందా?
- సీఎం కేసీఆర్ రైతుబంధు కింద రూ.5 వేలు కుడి చేత్తో ఇస్తే, డీజిల్ పేరుతో ఎడమ చేత్తో లాగేసుకుంటున్నందుకు మీకు ఓటెయ్యాలా?
- ఎఫ్సీఐ ద్వారా ధాన్యం సేకరణకు మొండిచెయ్యి చూపినందుకా? విదేశీ మక్కలు కొని ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తున్నందుకా?
- బడా కంపెనీలకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ సర్కారు, ఒక రైతుకూ రుణం మాఫీ చేయలేదు. ఇందుకోసం బీజేపీకి ఓటెయ్యాలా?
- ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయనికి అనుసంధానం చేసి రైతులు, కూలీలకు మేలు చేయాలని దేశమంతా మొత్తుకుంటున్నది. మేము అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపినం. అయినా ఆ పని మాత్రం చేయలేదు. ఉపాధిహామీ పథకంతో వ్యవసాయాన్ని బాగు చేయడానికి ఉపయోగించనందుకు బీజేపీకి ఓటెయ్యాలా?
- తెలంగాణలో రూ.2 లక్షల కోట్ల వ్యయంతో రైతుల కోసం ప్రాజెక్టులు కడుతున్నం. ఒక్క రూపాయి అయినా కేంద్రం సాయం చేసిందా? మహారాష్ట్రకు ఇస్తరు. పక రాష్ర్టానికి ఇస్తరు. కానీ, తెలంగాణకు ఇవ్వరు. అందుకు మీకు ఓటెయ్యాలా?
- కృష్ణా నీటిలో తెలంగాణ వాటాకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించనందుకు, స్పందించనందుకు బీజేపీకి ఓటెయ్యాలా?
- కృష్ణా నది నీళ్లను ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టుల ద్వారా తరలిస్తున్నా మౌనం వహిస్తున్నందుకు బీజేపీకి ఓటెయ్యాలా?