తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్ప పథకాలు చేపట్టి, దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఉన్నా, టీఆర్ఎస్కు సరిరావన్నారు. బుధవారం శామీర్పేట మండలంలోని అలియాబాద్ చౌరస్తాలో టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి ఆధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 14 ఏండ్ల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే కాదు దేశంలో తిరుగులేని రాజకీయ పార్టీగా టీఆర్ఎస్కు గుర్తింపు తీసుకొచ్చారన్నారు.
ఏడేండ్ల కాలంగా కష్టపడి దేశంలోనే ఎక్కడాలేని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. రాష్ట్రంలోని 12,700 పంచాయతీల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, హరితహారం నర్సరీలు, ధాన్యం కొనుగోలు తదితర కార్యక్రమాలు చేపట్టారన్నారు.
పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంటింటికీ మిషన్ భగీరథ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. దేశానికే ఆదర్శంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చానన్నారు. దళితబంధు ద్వారా దళితుల కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున లబ్ధి చేకూరేలా పథకాన్ని ప్రవేశపెడుతున్నారన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 4 నియోజకవర్గాలో చేపట్టారన్నారు.