ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అనుకూల స్టాండ్ తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ అడుగుజాడల వెంటే నడిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇంకా చాలాకాలం పడుతుందని కుండబద్దలు కొట్టా రు.
సీఎల్పీ కార్యాలయంలో మీడియా తో చిట్చాట్ చేసిన జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డామినేట్ చేస్తే తన వ్యక్తిగత అభిప్రాయాలను మార్చుకోనని స్పష్టంచేశారు. రేవంత్రెడ్డికి తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, అ అవసరం కూడా రాదని పేర్కొన్నారు. గతంలో తాను పార్టీ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్, బోసురాజు, శ్రీనివాసులుకు క్షమాపణ చెప్తే, దానిని రేవంత్కు చెప్పినట్టుగా ఆయన అనుచరులు తప్పుడు ప్రచారంచేశారని ఆరోపించారు.
రేవంత్రెడ్డికి మీకు మధ్య గ్యాప్ ఉన్నదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ‘ఏమో’ అంటూ సమాధానం దాటేశారు. దీంతో ఇద్దరి మధ్య వైరం కొనసాగుతున్నదనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్టయ్యింది. రేవంత్రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమా? లాభమా? అని ప్రశ్నించగా దీనికి కూడా ‘మీరే చెప్తారు’ అన్నారు. రేవంత్ వల్ల లాభం జరుగుతుందని జగ్గారెడ్డి చెప్పకపోవడం గమనార్హం.