దేశ ప్రజలకు కేంద్రం దీపావళి పండుగ వేళ తీపి కబురు వినిపించింది. దాదాపు ఏడాదిగా అరకొర సందర్భాల్లో పెంచడమే తప్ప తగ్గించని పెట్రో ధరలను ఎట్టకేలకు తగ్గించింది. పెట్రోలుపై లీటరుకు రూ.5, డీజిల్పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబరు 4 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
ఎక్సైజ్ డ్యూటీని పెట్రోలు (రూ.5) కన్నా డీజిల్పై రెట్టింపు (రూ.10) తగ్గించామని.. లాక్డౌన్ సమయంలో కూడా ఆర్థిక వ్యవస్థ చురుగ్గా కదలడానికి కారణమైన భారతీయ రైతులకు.. రానున్న రబీసీజన్ నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం ఉత్సాహాన్నిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. కేంద్రం తాజా నిర్ణయంతో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.27.90కి, డీజిల్పై రూ.21.80కి తగ్గింది. ఈ నిర్ణయంతో.. ఇంధనాల మీద ఎక్సైజ్ ఆదాయం నెలకు సగటున రూ.8700 కోట్ల చొప్పున ఏడాదికి దాదాపు రూ.లక్ష కోట్ల దాకా తగ్గుతుందని అంచనా.
నవంబరు నుంచి వచ్చే మార్చి 31 దాకా లెక్కిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.43,500 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందని అంచనా. తగ్గిన రేట్ల ప్రకారం హైదరాబాద్లో లీటర్ పెట్రోలు ధర రూ.109.47కుతగ్గింది. ఇక.. ఇప్పటికే సెంచరీ దాటేసిన డీజిల్ మళ్లీ రూ.100 దిగువకు వచ్చింది. లీటర్ డీజిల్ రూ.107.37 నుంచి రూ.97.37కు చేరింది.