యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై ఏర్పాటుచేసి న అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక సంస్కరణలు, పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని స్పష్టం చేశారు. సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టడంతో అనూహ్యంగా దిగుబడులు పెరిగాయని చెప్పారు. వానకాలంలో పంట ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నదని, అయినా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. మిల్లర్ల వల్ల అపప్రద వస్తున్నదని, దీన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. లేకుంటే మిల్లుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. గన్నీబ్యాగుల కొరతను పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, కలెక్టర్ యాస్మిన్బాషా పాల్గొన్నారు.