‘రాయలసీమ కరువు ప్రాంతం. అక్కడకు నీళ్లు కావాలని గతంలో నేను వెళ్లి చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కృష్ణానదిలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్న నీటిని ఇటు మళ్లించుకుందామని ఏపీ సీఎం జగన్మోహనరావుకు కూడా చెప్పా. ఈ విషయంలో ఏపీ సీఎంను హైదరాబాద్కు పిలిపించి మరీ ఇదే విషయం చెప్పా. బేసిన్లు, భేషజాలు అడ్డం పెట్టం. తప్పకుండా సహకరిస్తాం అని చెప్పా’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ప్రగతి భవన్లో సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులపై మండిపడ్డారు. కేంద్రలో ఏ పార్టీ ఉన్నా కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యూహాలు రచిస్తుందని విమర్శించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు కృష్ణ, గోదావరి, కావేరీ నదుల అనుసంధానం అంటారని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక ఆ ఊసే ఉండదని దుయ్యబట్టారు.
మొన్నటి వరకూ తమిళనాడు ఎన్నికలు ఉన్నప్పుడు కావేరీ జలాలు, కావేరీ నది అనుసంధానం అంటూ మాట్లాడిన నేతలు ఎన్నికలు ముగియగానే సైలెంట్ అయిపోయిన విషయాన్ని కేసీఆర్ ఎత్తిచూపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు ప్రాంతాలకు అందాల్సిన నీరు అందిన తర్వాత అధికంగా ఉన్న నీటిని పక్క రాష్ట్రాలకు పట్టుకెళ్లినా పర్వాలేదని తాను చెప్తే.. ఆ మాటలను కూడా వక్రీకరించారని సీఎం మండిపడ్డారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి చేపల పులుసు తిన్నారంటూ విమర్శలు చేశారని, అలా చేపల పులుసు తింటే తప్పా? అంటూ విమర్శకులకు చురకలు వేశారు.