ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పలు చోట్ల టీడీపీకి.. ఇంకొన్ని చోట్ల వైసీపీకి గట్టిగానే షాకులు తగులుతున్నాయి. అయితే.. మంత్రుల స్వగ్రామంలో.. నివాసముండే ప్రాంతాల్లో కూడా టీడీపీ జెండా ఎగిరిందంటే మామూలు విషయం కాదు. అలాంటి సందర్భాలు ప్రస్తుత ఎన్నికల్లో చోటుచేసుకున్నాయి.
పూర్తి వివరాల్లోకెళితే.. బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్కు భారీ షాక్ తగిలింది. బుగ్గన నివాసం ఉండే 15 వార్డులో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు బేతంచెర్లలో సంబరాలు చేసుకుంటున్నాయి. బేతంచెర్లలో మొత్తం 20 వార్డులుండగా.. వైసీపీ 14, టీడీపీ 6 వార్డుల్లో విజయం సాధించింది.