సినీనటి స్నేహకు ఆంధ్రప్రదేశ్కు చెందన ఓ ప్రముఖ సిమెంట్ కంపెనీ టోకరా వేసింది. ఏపీలో ప్రధాన కార్యాలయం కలిగిన ఆ కంపెనీ నిర్వాహకులు తనను మోసం చేసి రూ.26 లక్షలు కాజేశారంటూ స్నేహ, ఆమె భర్త, నటుడు ప్రసన్న గురువారం పోలీసులను ఆశ్రయించారు.
రూ.26 లక్షల డిపాజిట్ చేస్తే నెలకు రూ.1.80 లక్షల చొప్పున చెల్లిస్తామని నమ్మించి మోసం చేశారని కానత్తూరు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత మే నెలలో తాము ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయగా, ఇంతవరకూ ఎలాంటి నగదు ఇవ్వకుండా ఆ కంపెనీ నిర్వాహకులు మొహం చాటేస్తున్నారని తెలిపారు.
తాము రూ.25 లక్షలు ఆన్లైన్ ద్వారా, మరో లక్ష రూపాయలు నేరుగా చెల్లించామని వివరించారు. తమ డబ్బులు తిరిగిచ్చేయాలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణకు రావాలంటూ ఆ కంపెనీ నిర్వాహకులకు సమన్లు పంపించినట్లు సమాచారం.