కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధానికి సిద్ధమైంది. ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్నది.
ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని ఉభయసభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణలో చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నదని, రూల్ 267 కింద తక్షణమే ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభ చైర్మన్ను ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు.
ఎఫ్సీఐ నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల తెలంగాణలో లక్షల టన్నుల ధాన్యం మార్కెట్ యార్డుల్లో మురిగిపోతోందని ఎంపీ కేశవరావు తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పంట సేకరణ విధానం వివక్షపూరితంగా ఉందని, తెలంగాణలో పండిన రబీ పంటను కేంద్రం సేకరించడంలేదని ఆయన ఆరోపించారు.