ప్రస్తుతం భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కొత్తగా వచ్చిన ఒమైక్రాన్ వేరియంట్ కరోనా వైర్సను తలచుకొని వణికిపోతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్న తీరును జాగ్రత్తగా గమనిస్తున్నాయి. కొన్ని దేశాలు గత రెండు వేవ్ల కరోనా వైరస్ సంక్షోభాన్ని గుర్తు చేసుకొని ముందు జాగ్రత్తగా సరిహద్దులు మూసేందుకు కూడా సిద్ధమయ్యాయి. అయితే, ఒమైక్రాన్ వేరియంట్ మరీ అంత ప్రమాదకారి కాదని ఇప్పటిదాకా జరిగిన పరిశీలనల్లో వెల్లడవుతోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మినహా ఏ దేశంలోనూ ఒమైక్రాన్ బాధితులెవరూ మరణించిన దాఖలాలు లేవు.
కనీసం చెప్పుకోదగ్గ తీవ్ర లక్షణాలు కూడా ఎవరిలోనూ కనబడటం లేదు. గత రెండు వేవ్ల తరహాలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆస్పత్రులపాలై, బెడ్లు, ఆక్సిజన్, మందులు దొరక్క బెంబేలెత్తే పరిస్థితి ఏ కోశానా తలెత్తే అవకాశం లేదని భావిస్తున్నారు. భారతదేశంలో ఇప్పటిదాకా 32 మందికి ఒమైక్రాన్ పాజిటివ్ తేలింది. వారంతా విదేశాల నుంచి వచ్చిన వారు లేదా, ఇక్కడికి వచ్చాక వారితో కాంటాక్టులో ఉన్న వారు.
ఇతర దేశాల నుంచి వచ్చిన వేల మందిని పరీక్ష చేయగా, వీరికి ఒమైక్రాన్ ఉందని తేలింది. అయితే, 32 మందిలో ఏ మాత్రం కొవిడ్ లక్షణాల్లేవు. కేవలం ఇద్దరిలో అతి స్వల్ప లక్షణాలు కనిపించాయి. గత రెండు వారాల్లో 2, 3 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఒమైక్రాన్ పాజిటివ్ తేలినప్పటికీ వారికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఒక్కరు తప్ప ఎవర్నీ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేక పోయినా అందర్నీ అబ్జర్వేషన్లో పెట్టారు. పిల్లలు తప్ప విదేశాల నుంచి వచ్చిన వారంతా 2 డోసుల టీకా వేయించుకున్న వారే. అయినా, కరోనా సోకిందంటే టీకా వేయించుకున్నంత ఇతర జాగ్రత్తలు గాలికి వదిలేయడం కుదరదన్నమాటే.