శిల్పా చౌదరి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బ్లాక్ మనీని వైట్మనీగా మార్చడానికి ఆమె భారీగా స్కెచ్ వేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కీలకాధారాలు సంపాదించినట్లు సమాచారం. ఇప్పటివరకు రూ.90 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.50కోట్ల పైచిలుకు హవాలా మార్గంలో పంపి విదేశాల్లో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి బ్లాక్ మనీ ని వైట్గా మార్చాలని ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం.
వీటిని ఆమె అంగీకరించకపోవడంతో పోలీసులు కీలకాధారాలు శిల్ప ముందు ఉంచగా, ఆమె కంగుతిన్నట్లు తెలుస్తోంది. బ్లాక్మనీని మార్చమని శిల్పాచౌదరికి డబ్బులు ఇచ్చిన వారందరికీ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
‘నా ఆరోగ్యం బాగోలేదు.. ప్లీజ్ నన్ను విసిగించొద్దు.. మీరెంత ఇబ్బంది పెట్టినా నా వద్ద ప్రస్తుతం డబ్బుల్లేవ్. నాకు ఇవ్వాల్సిన వారు ఇవ్వలేదు’ అంటూ.. శిల్పాచౌదరి పోలీసుల విచారణలో మొండికేసినట్లు తెలిసింది. ఆర్థిక మోసం కేసులో అరెస్టయిన శిల్పాచౌదరిని నార్సింగ్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. శనివారం రెండోరోజు విచారణలో భాగంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదని సమాచారం.