ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దని, వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని చెప్పారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు తొమ్మిదికి చేరాయని వెల్లడించారు. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదని పేర్కొన్నారు.
నాన్రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా మూడో వేవ్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, లాక్డౌన్ పెడతారన్న దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు.దేశంలోని ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరిద్దరే దవాఖానల్లో చేరారని వెల్లడించారు.
దేశంలో 11 రాష్ట్రాల్లో 88 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. మొత్తం 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని వెల్లడించారు. ఈ వేరియంట్ వల్ల ప్రపంచంలో ఒక్క మరణం మాత్రమే నమోదయిందన్నారు. భవిష్యత్లో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.