తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుండి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు.
ఆరోగ్య సిబ్బందికితోడు మున్సిపల్, పంచాయతీ అధికారులు ఫీవర్ సర్వేలో పాల్గొంటారన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తారన్నారు.లక్షణాలున్న వారందరికీ హోం ఐసోలేషన్ కిట్లు ఇవ్వడంతో పాటు వారి ఆరోగ్యాన్ని రోజూ మానిటర్ చేస్తారని తెలిపారు. అవసరం అయితే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
నీతి ఆయోగ్ సైతం బెస్ట్ ప్రాక్టీస్ అని ప్రశంసించిందని గుర్తు చేశారు. 2కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు కూర్చినట్లు చెప్పారు. వీటిని పీహెచ్సీ స్థాయిలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని, జ్వర సర్వే కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పాల్గొని విజయవంతం చేయాలన్నారు.ప్రతి ఇంటా పరీక్షలు నిర్వహించి, ముందస్తుగా వ్యాధి లక్షణాలను గుర్తించి, సకాలంలో చికిత్స మొదలు పెడుతామన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ ఉన్నా.. తీవ్రత తక్కువగా ఉందని, అలా అని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. జేహెచ్ఎంసీ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లో టెస్టింగ్, కిట్ల పంపిణీ ఉంటుందన్నారు. కరోనా తగ్గే వరకు ఆదివారం 2గంటల వరకు అన్ని బస్తీ దవాఖానలు సేవలు అందిస్తాయని హరీశ్రావు వివరించారు.