తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ప్రధాన సర్కారు దవాఖానలో తొలిసారిగా భర్త సమక్షంలో పురుడు పోసిన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లా ప్రధాన సర్కారు ఆసుపత్రిలో ఈ సంఘటనకు నాంది పలికారు వైద్యులు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో హెచ్ఓడీ కృపా ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది అలవాల మాధురి ,గాయత్రి,స్టాఫ్ నర్సు అరుణ నూతన విధానంలో శ్రీలత అనే గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు.
ఆ సమయంలో ఆమె భర్తను లేబర్ రూంలోకి పిలిపించారు. శ్రీలత ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో గర్భిణీలో భయం ఆందోళన ,ఒత్తిడి ఉంటుంది. ఆ కారణంగా నొప్పులు రావడానికి అవసరమైన ఆక్సిటోసిన హర్మోన్ విడుదల కాదని వైద్య సిబ్బంది ఈ సందర్భంగా తెలిపారు. అందుకే భర్తగానీ ఆమెకు దగ్గరైన వారిని ఆమె చేయి పట్టుకోవడం ,తల నిమరడం లాంటివి చేయడం ద్వారా ఆక్సిటోసిన్ విడుదలై నొప్పులు త్వరగా వచ్చి సుఖప్రసవం అవుతుందని వివరించారు.
అయితే ప్రసవ సమయంలో పక్కనే ఉండి శిశువు బొడ్డు తాడును తండ్రి చేత కట్ చేయిస్తే అతడు గొప్ప అనుభూతిని పొందుతాడు. అంతేకాకుండా ప్రసవ సమయంలో భార్య పడే బాధను ప్రసవ వేదనను దగ్గర ఉండి చూస్తే ఆమెపై మరింత గౌరవం పెరుగుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. కాన్పు గదిలో ఆమె భర్త,తల్లి దండ్రులు ,అత్త ,చెల్లె ఇలా బంధాల్లో ఎవరైన ఒకర్ని అనుమతిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.