తెలంగాణ రాష్ట్ర పరిపాలనపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘మేము అవినీతి చేసినమని మీరు (బీజేపీ నేతలు) అంటున్నరు. మీరు మెరిగే కుక్కలని మేము అంటం. తెలంగాణ వట్టిగనే నిర్మాణం అయిందా! కోట్లు, లక్షల లంచాలు ఇచ్చే బిల్డింగ్ అనుమతులు.. ఇప్పుడు టీఎస్బీపాస్ ద్వారా ఆన్లైన్లో ఒక్క రూపాయి లంచం లేకుండానే ఇస్తున్నాం.
దీనికి చట్టం చేసినం. 15 రోజుల్లో అనుమతి లేకుంటే 16వ రోజు డిమ్డ్ టు అప్రూవ్డ్ అన్నాం. మాది అవినీతి ప్రభుత్వం అయితే, మేము అవినీతిపరులం అయితే ఆన్లైన్ అనుమతులు ఎందుకు ఇస్తం? పక్క రాష్ట్రంలో రియల్ ఎస్టేట్లో చదరపు అడుగుకు ఇంత అని వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఆన్లైన్లో అనుమతులు ఇస్తున్నాం’ అని చెప్పారు. ఇక్కడ పొలిటికల్ గుండాగిరి లేదు, భూకబ్జాలు లేవు, గుడుంబా గబ్బు లేదు, పేకాట క్లబ్బులు లేవు.. ఇవన్నీ వాస్తవాలు కాదా? అని ప్రశ్నించారు.
‘ఇష్టం వచ్చినట్టు.. కుక్కలు మెరిగినట్టు మెరుగుతం అంటే.. అందుకే మిమ్ముల్ని పిచ్చి కుక్కలు అంటం. మేము ఉరుకుంటమా? ఎందుకు ఉరుకోవాలి? మీ దిక్కుమాలిన దందాతోటి ఈ సమాజాన్ని కరాబు కానిస్తమా? ప్రాణాలు ఫణంగా పెట్టి, సచ్చే దాకా కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఇది. ఎవరో కుక్క గాళ్లు, నక్క గాళ్లు వచ్చి కరాబు చేస్తమంటే కూర్చుంటమా.. కూర్చోవాల్నా! ఇండియాలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు చేస్తున్నాం. ఇది మీకు జీర్ణం కావడంలేదు. బీజేపీ పరిపాలించే రాష్ర్టాల సీఎంలకో, ప్రధానమంత్రికో, మీకు తెలివి ఉన్నదా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.