తమ ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామాల్లోని భూముల వేలం ప్రక్రియను అడ్డుకోవాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
కోకాపేటలో 49.94 ఎకరాలు, ఖానామెట్లో 14.91 ఎకరాల భూముల వేలాన్ని నిలిపివేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ, నటి విజయశాంతి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టి వేసింది. భూముల వేలం ప్రక్రియకు టెండర్లు, ఈవేలం వంటి విధానాలను అమలుచేయడం ద్వారా ప్రభుత్వం పారదర్శకత పాటించాలని షరతులు విధించింది.
ఈ పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలీతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. గతంలో విచారణ చేసిన హైకోర్టు, భూముల వేలం ప్రక్రియ కొనసాగింపునకు అనుమతి ఇస్తూనే తమ అనుమతి లేకుండా ఏవిధమైన విక్రయాలు నిర్వహించరాదని ఆదేశించింది. పిల్ను డిస్మిస్ చేయడం, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో భూముల విక్రయాలకు అడ్డంకులు తొలగిపోయాయి.