తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను మరోసారి గుర్తుచేశారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, బకాయిల రూపంలో రాష్ర్టానికి సుమారు రూ.27,350 కోట్ల వరకు రావాల్సి ఉన్నది. మంత్రి లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి రూ.900 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉన్నది. వీటిని విడుదల చేయడంతోపాటు గ్రాంట్ను 2021-22 తర్వాత ఐదేండ్లపాటు పొడిగించాలి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.30,751 కోట్లు ఇవ్వాలని కోరితే.. నీతి ఆయోగ్ రూ.24,205 కోట్లు ఇవ్వాలని సూచించింది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలి.
- స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 502.29 కోట్లు) ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం అకారణంగా తిరసరించింది. రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిరసరించారు. కాబట్టి వీటిని వీలైనంత త్వరగా విడుదలయ్యేలా చూడాలి.
- 2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని ఈ మేరకు తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. ఆర్థిక సంఘం సిఫారసులను గతంలో ఎప్పుడూ తిరసరించిన సందర్భాలు లేవు. కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ నిధులను మంజూరు చేయాలి.
- రాష్ట్రంలో అమలుచేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలలో.. రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో కేంద్రం వాటాను పొరపాటున తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్ ఖాతాకు జమచేశారు. దీంతో తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు ఆంధ్రప్రదేశ్కు వెళ్లాయి. ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ, ఇంకా తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదు. కాబట్టి ఈ మొత్తాన్ని వెంటనే తెలంగాణకు విడుదలచేయాలి. వీటితోపాటు పెండింగ్లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్లను సర్దుబాటు చేయాలి’ అని మంత్రి హారీశ్ రావు విజ్ఙప్తిచేశారు.