ఒకవైపు వందలకొద్దీ యుద్ధ ట్యాంకులను దురాక్రమణకు నడిపిస్తూనే.. బాంబుల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు చర్చలకు హాజరవుతున్న రష్యా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని హత్య చేయించేందుకు 400 మంది కిరాయి గూండాలను రంగంలోకి దింపిందంటూ యూకేకు చెందిన టైమ్స్ వార్తా సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. జెలెన్ స్కీతోపాటు.. ఉక్రెయిన్ ప్రధాని, ఆయన కేబినెట్లోని మంత్రులు, కీవ్ మేయర్, ఆయన సోదరుడు (ఇద్దరూ బాక్సింగ్ చాంపియన్లు).. ఇలా 23 మంది కీలక నేతల పేర్లు కూడా రష్యా పంపిన కిరాయి మూకల హిట్లి్స్టలో ఉన్నట్టు ఆ కథనంలో పేర్కొంది
. ఈ కిరాయి మూక సభ్యులంతా ‘వాగ్నర్ గ్రూప్’ అనే ప్రైవేట్ మిలీషియాకు చెందినవారని.. ఆ గ్రూపును నడిపేది పుతిన్కు సన్నిహితుడు ఎవ్జెనీ ప్రిగోఝిన్ అని అందులో పేర్కొంది. వారంతా ఐదువారాల క్రితమే ఆఫ్రికా నుంచి ఉక్రెయిన్కు చేరుకున్నట్టు వెల్లడించింది. ఈ విషయం ఉక్రెయిన్ ప్రభుత్వానికి గత శనివారమే తెలిసి.. రాజధాని కీవ్లో ఆ కిరాయి మూకలను జల్లెడపట్టడానికి 36 గంటలపాటు కఠినమైన కర్ఫ్యూ ప్రకటించింది. ఆ సమయంలో పౌరులెవరైనా గడపదాటి కాలు బయటపెడితే వారిని క్రెమ్లిన్ ఏజెంట్లుగా భావించి ప్రాణాలు తీస్తామని హెచ్చరించింది.
నిజానికి ఈ ఏడాది జనవరిలోనే 2000 నుంచి 4000 మంది దాకా కిరాయి హంతకులు వేర్వేరు మిషన్లపై ఉక్రెయిన్కు వచ్చారని వాగ్నర్ గ్రూపుతో సంబంధాలున్న వర్గాల సమాచారం. వారిలో కొందరిని.. లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలకు పంపగా.. 400 మందిని అధ్యక్షుడు, ప్రధాని సహా ప్రభుత్వంలోని మంత్రులను చంపడానికి నియోగించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. వీరంతా తమ హిట్లి్స్టలో ఉన్న కీలక నేతలను వారి ఫోన్ల ద్వారా ట్రాక్ చేస్తున్నట్టు సమాచారం.