ఉక్రెయిన్ విషయంలో రష్యా రోజురోజుకీ మరీ పాశవికంగా ప్రవర్తిస్తోందన్న విమర్శలు ప్రపంచమంతా వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యవహరిస్తున్న తీరును రష్యన్ పౌరులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆర్మీ టార్గెట్గా రష్యా బలగాలు ముందుకు కదిలితే.. తాజాగా… పౌరులను కూడా టార్గెట్ చేస్తున్నాయి. పౌరులు నివసించే నివాస ప్రాంతాలను కూడా టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా వచ్చిన వార్తలను చూస్తే ఒళ్లు గగుర్పుట్టడం ఖాయం.
ఉక్రెయిన్లోని నివాస ప్రాంతాలపై ఎరుపు రంగులో కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి. రష్యా సేనలు దాడులు చేయడానికే ఈ గుర్తులు వెలిశాయని కొందరు పేర్కొంటున్నారు. బిల్డింగ్ పై భాగంలో x అనే గుర్తులు ఉన్నాయి. అవి కూడా ఎరుపు వర్ణంలో ఉండటం అందరినీ షాక్కి గురి చేస్తోంది. అయితే ఈ గుర్తులు ఇప్పటికీ మిస్టరీగానే మారాయి. ఎవరు ఈ గుర్తులను ఏర్పాటు చేశారన్నది తెలియడం లేదు.
ఈ గుర్తులు ఒక్కసారిగా వెలుగు చూడటంతో ఉక్రెయిన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక వేళ నివాస ప్రాంతాలపై ఎరుపు వర్ణంతో గనక గుర్తులు ఉన్నట్లయితే.. ఆ బిల్డింగులో ఉన్న వారు వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే తమ తమ బిల్డింగులపై ఓ సారి చెక్ చేసుకోవాలని, లేట్ చేయొద్దని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. తమ నివాస ప్రాంతాలను ఒక్కసారిగా చెక్ చేసుకోవాలని అప్పీల్ చేస్తున్నాం. ట్యాగులున్నాయో చూసుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ ఎలాంటి గుర్తులైనా కనిపిస్తే మాత్రం.. వెంటనే ఆ ఇళ్లను ఖాళీ చేయండి. అంటూ అధికారులు కోరుతున్నారు.