మహిళల గౌరవం కాపాడే విధంగా మరిన్ని చట్టాలను తీసుకురావాలని ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, తెలంగాణ విభాగం నేడు మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని కలిసి విజ్ణప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ విభాగం అధ్యక్షులు డాక్టర్ శ్రావణ్ రెడ్డి, కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్, సభ్యులు కలిసి మంత్రికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి లింగ సమానత్వం – రేపటి మహిళల ఉజ్వల భవిష్యత్ నినాదంతో జరిగే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించి, పరిష్కరించాలని కోరారు.
ఇప్పటికే ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధి, భద్రత కోసం అనేక చర్యలు చేపడుతోందని, అయినా ఇంకా కొన్ని చేయాల్సి ఉందన్నారు. గృహ హింస కేసులను త్వరగా పరిష్కరించాలని, మహిళా ఉద్యోగులకు 317 జీవో నుంచి మినహాయింపు ఇవ్వాలని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని, స్వయం ఉపాధి పథకంలో మహిళలకు ఎక్కువగా రుణాలు ఇవ్వాలని, ఆశా వర్కర్లు బాగా పని చేస్తున్నారని, వారికి విధి నిర్వహణలో భాగంగా రవాణా సదుపాయం కల్పించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని, సైబర్ క్రైమ్ లో బాధితులు త్వరగా దొరకడం లేదని…మరింత త్వరగా వారిని పట్టుకునే చర్యలు చేపట్టాలి అని కోరారు.
మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు వీరి విజ్ణప్తికి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తానని తెలిపారు.ఉమెన్ పోలీసులు ధర్నాలలో మహిళా నేతలను చాలా ఇబ్బంది పెడుతున్నారని, దీని మీద దృష్టి పెట్టి ఇలా జరగకుండా చూడాలని, కొద్దిగా గౌరవంగా మహిళా నేతల పట్ల ప్రవర్తించే విధంగా చూడాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇపుడున్న మహిళా పోలీసు అధికారులు బాగా చేస్తున్నారని, అయితే అక్కడక్కడ క్షేత్ర స్థాయిలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్నారు. ఇవి కూడా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామన్నారు.