మెల్బోర్న్: ఆస్ట్రేలియాకు చెందిన స్పిన్ మాంత్రికుడు షేన్వార్న్ మృతిని అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. స్పిన్ దిగ్గజం ఇకలేరంటే నమ్మలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రముఖ క్రికెటర్లు సైతం గుర్తుచేసుకుని వార్న్కు నివాళులర్పించారు. అందరి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిన వార్న్ మృతిని అతడి కుటుంబం, పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వార్న్ ఇద్దరు కుమార్తెలు బ్రూక్, సమ్మర్.. కుమారుడు జాక్సన్ తండ్రిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.
లేటెస్ట్గా వార్న్ పిల్లలు తండ్రిని స్మరించుకుంటూ సోషల్ మీడియాలో ఓ లెటర్ను విడుదల చేశారు. అందులో తాము పడుతున్న బాధ, ఆవేదనను పేర్కొన్నారు. ”మా నాన్న లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. డాడీ చాలా మిస్సవుతున్నాము. నిజంగా నువ్వు బెస్ట్ ఫాదర్వి. ఎప్పుడూ మేం సంతోషంగా ఉండాలని కోరుకున్నావు. విధి ఎంతో క్రూరమైనది. నిన్ను ఎంతో త్వరగా తీసుకెళ్లింది. మీరు చనిపోలేదు. ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు” అని కుమార్తెలు బ్రూక్, సమ్మర్..కుమారుడు జాక్సన్ పేర్కొన్నారు.