దిల్లీ: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. యూపీ, పంజాబ్ ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఈరోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎగ్జిట్పోల్ అంచనాలను దాదాపుగా నిజం చేస్తూ ఫలితాలు వచ్చాయి. యూపీలో తొలి నుంచే అధికార బీజేపీ ఆధిక్యం కొనసాగింది. ఉత్తరాఖండ్, మణిపూర్లోనూ కాషాయ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. రాజకీయ విశ్లేషకులు ఊహించిన విధంగానే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. గోవాలో హంగ్ వస్తుందని భావించినప్పటికీ బీజేపీకే పూర్తి మెజార్టీ వచ్చింది. హంగ్ పరిస్థితి ఇప్పుడు మణిపూర్కి వచ్చేలా ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన రిజల్ట్స్ను బట్టి చూస్తే..
యూపీ బీజేపీదే..
403 స్థానాలున్న యూపీలో బీజేపీ 215 చోట్ల విజయం సాధించి 58 స్థానాల్లో లీడ్లో ఉంది. దీంతో యూపీలో బీజేపీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమైంది. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) 80 స్థానాల్లో గెలుపొంది 44 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. యూపీలో కాంగ్రెస్, బీఎస్పీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ కేవలం రెండు సీట్లకి, బీఎస్పీ ఒక్క స్థానానికే పరిమితమైపోయాయి.
పంజాబ్లో ఆప్ సెన్సేషనల్ విక్టరీ..
పంజాబ్లో ఆమ్ఆద్మీ (ఆప్) పార్టీ దుమ్ములేపింది. ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. 117 నియోజకవర్గాలున్న పంజాబ్లో ఆప్ 92 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఓ దశలో 100 సీట్లు కూడా ఆప్ దక్కించుకుంటుందనేలా పరిస్థితి కనిపించింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని భావించినప్పటికీ.. అంతర్గత కుమ్ములాటలతో కేవలం 17 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పంజాబ్లో సుఖ్బీర్సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), బీజేపీ నామమాత్రంగా నిలిచాయి. ఎస్ఏడీకి 4, బీజేపీకి 2 స్థానాలు మాత్రమే దక్కాయి.
మణిపూర్లో హంగ్?
70 సీట్లు ఉన్న ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. 47 చోట్ల బీజేపీ, 18 చోట్ల కాంగ్రెస్.. మిగిలిన స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. అయితే బీజేపీకి చెందిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఓటమి పాలవడం గమనార్హం. మరోవైపు 40 స్థానాలున్న గోవాలో 20 స్థానాల్లో గెలుపొందడంతో బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ కూటమి 12, తృణమూల్ కాంగ్రెస్ 2, ఆప్ 2, ఇండిపెండెంట్లు 4 సీట్లలో విజయం సాధించారు. 60 స్థానాలున్న మణిపూర్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 16 స్థానాల్లో బీజేపీ గెలిచి 9 చోట్ల లీడ్లో ఉంది. కాంగ్రెస్ కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించి 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. జేడీయూ 5, ఇండిపెండెంట్లు 6, ఎన్సీపీ 2 చోట్ల గెలిపొందాయి. మణిపూర్లో ఏ పార్టీకి కూడా మెజార్టీ మార్క్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. హంగ్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.