కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విభాగం అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఉన్న అనేక రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేస్తూ చాలా వరకు అధిగమించాం.
అయితే పేదలకు అందాల్సిన పట్టాల విషయంలో మరింత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనేక ప్రాంతాల్లో పట్టాల కోసం ప్రజలు వేచి చూస్తున్నారని, అటువంటి లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా వేగంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరో సారి 58,59 జీవోను అమలు చేస్తున్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించి దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కానీ అనేక సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో అమలవుతున్నాయని, దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా అర్హులకు అందే విధంగా అధికారులు ప్రజలకు చైతన్యం కల్పించాలని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం లబ్ధిదారులు ఆ నగదుతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో మల్లయ్య, ఎమ్మార్వోలు భూపాల్, సంజీవ రావు, సరిత, డిటి సుధాకర్ పాల్గొన్నారు.