హైదరాబాద్: ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో సీట్లు తగ్గడం దేనికి సంకేతమో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అన్నారు. యూపీలో బీజేపీ బలం తగ్గుతుందని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశం బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాలని ఆయన పునరుద్ఘాటించాఉ. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలన బాగాలేదనే ప్రజలు బీజేపీకి అధికారం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పాలన కంటే బీజేపీ పాలన మరింత అధ్వానంగా ఉందని కేసీఆర్ విమర్శించారు.
గతసారి జరిగినట్లు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని కేసీఆర్ క్లారిటీగా చెప్పారు. ఆరునూరైనా ఆ పరిస్థితి ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో గెలుపొంది మళ్లీ అధికారం దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు సంస్థలతో సర్వే చేయించామని చెప్పారు. నేషనల్ పాలిటిక్స్ను ప్రభావితం చేయడానికి నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. తన ఆహ్వానం కోసమే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారన్నారు. ఆయన డబ్బులు తీసుకోకుండా పనిచేస్తారని.. ప్రశాంత్ కిశోర్ డబ్బు తీసుకుని పనిచేస్తున్నట్లు ఎవరైనా నిరూపించగలరా? అని కేసీఆర్ ప్రశ్నించారు.