చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 132 మంది చనిపోయారని ప్రాథమికంగా అక్కడి అధికారులు తేల్చారు. అయితే మృతుల్లో ఏ ఒక్కరి ఆచూకీ కూడా ఇప్పటి వరకు దొరకలేదని తెలిపారు. సోమవారం గువాంగ్జీ నుంచి వెళ్తున్న చైనా ఈస్టర్ ఎయిలైన్స్ బోయింగ్ 737 ఫ్లైట్ ఉజౌ పట్టణానికి సమీపంలోని ఓ పర్వతాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు, సౌండ్తో విమానం పేలిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ప్రమాదం జరిగినప్పటి నుంచి ఘటనాస్థలంతో పాటు సమీప ప్రాంతాల్లో ఎంత గాలించినా ఒక్కరి ఆచూకీ కూడా దొరకలేదు. ప్రమాదం జరిగినపుడు 123 ప్రయాణికులతో పాటు 9 మంది ఫ్లైట్ స్టాఫ్ ఉన్నారు. ఘటన జరగడానికి గల కారణాలను సేవ్ చేసే బ్లాక్ బాక్స్ కూడా ఇంత వరకు దొరకలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి అధికారులు చెప్పారు.