తెలంగాణ రాష్ట్ర రాజధాని పరిధిలో హైదరాబాద్ జంట నగరాల్లోని సికింద్రాబాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే.. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల వివరాలను తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని, విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని మంత్రి వెల్లడించారు.