ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు (ఎంసీడీ)ను వాయిదా వేస్తున్న నేపథ్యంలో బీజేపీపై ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటీష్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించి ప్రజాస్వామ్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయడమంటే వారిని అవమానించినట్టేనని చెప్పారు. దిల్లీ అసెంబ్లీ వద్ద కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
ఎంసీడీ ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించి బీజేపీ విజయం సాధిస్తే తమ పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలను వాయిదా వేస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను కూడా వాయిదా వేస్తారేమో అని ఢిల్లీ సీఎం ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. చిన్న పార్టీ, చిన్న ఎన్నికలకు భయపడుతోందన్నారు.