ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పామన్నారు. ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల, టీఆర్ఎస్ ఎంపీలతో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్రెడ్డి మాట్లాడారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చాలా హేళనగా మాట్లాడారని.. తెలంగాణ రాష్ట్రం, ప్రజలను ఆయన అవమానించారని ఆరోపించారు. రా రైస్, బాయిల్డ్ రైస్ అనేది తమకు సంబంధం లేదని.. మిల్లర్లతో మాట్లాడుకుని కేంద్రమే పట్టించుకోవాలన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం ఉన్నందున రాష్ట్రం తరఫున అవసరమైన సాయం అందిస్తామని.. పంట కొనుగోలు కేంద్రాలకు ఎంత వస్తే అంత ధాన్యం కూడా కొనుగోలు చేయాలని పునరుద్ఘాటించారు. పంజాబ్లో ఎలా తీసుకుంటున్నారో.. తెలంగాణలో యాసంగి వడ్లను అదే విధంగా తీసుకొని డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడు చెప్పిన అంశాలనే తాము కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నామని చెప్పారు.