ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ మరో మూవీని ప్రకటించేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ షూట్ చివరి దశకు వచ్చేయగా.. కొత్తగా ‘జనగణమన (JGM)’ పేరుతో మూవీని అనౌన్స్ చేశారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కే అవకాశముంది. గతంలో ‘జనగణమన’ మూవీలో మహేశ్బాబు హీరోగా నటించనున్నట్లు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ నుంచి మహేశ్ తప్పుకున్నారు. ఇప్పుడు అదే కథతో JGM రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
JGM మూవీని పూరీ జగన్నాథ్ సొంత సంస్థ పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్పై చార్మి, దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 23న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. JGM మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్స్ బట్టి చూస్తే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ అధికారిగా నటిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ‘లైగర్’ మూవీ ఈ ఏడాది ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది.