పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యాబై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లియామ్ లివింగ్స్టోన్ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా.. శిఖర్ ధవన్ (33; 4 ఫోర్లు, ఒక సిక్సర్), జితేశ్ (26; 3 సిక్సర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో జోర్డాన్, ప్రిటోరియస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఛేదనలో చెన్నై 18 ఓవర్లలో126 పరుగులకు ఆలౌటైంది. శివమ్ దూబే (30 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. మహేంద్రసింగ్ ధోనీ (28 బంతుల్లో 23; ఒక ఫోర్, ఒక సిక్సర్) ధాటిగా ఆడలేకపోయాడు. ఊతప్ప (13), గైక్వాడ్ (1), మోయిన్ అలీ (0), అంబటి రాయుడు (13), కెప్టెన్ రవీంద్ర జడేజా (0), బ్రేవో (0) విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 3.. వైభవ్, లివింగ్స్టోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అయితే ఈ మ్యాచ్ లో ఎంఎస్ ధోనీ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరఫున అత్యధిక టీ20లు ఆడిన రెండో క్రికెటర్ గా ధోనీ నిలిచాడు. ధోని ఇప్పటివరకు 350 మ్యాచ్ లు ఆడాడు. అందులో ఇంటర్నేషనల్ మ్యాచ్ లు 98, ఐపీఎల్ లో మ్యాచ్ లు 223, మిగతావి ఛాంపియన్స్ లీగ్ ఆడినవి ఉన్నాయి. మరోవైపు ధోనీ కంటే ముందు రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ మొత్తం 372 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత రైనా (336), దినేశ్ కార్తీక్ (329), కోహ్లి (328) ఉన్నారు.