పోలీసులపై హల్చల్ చేసి దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై దుర్భాషలు మాట్లాడటంతో భోలక్పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్పై చర్యలు తీసుకున్నారు. ఇటీవల భోలక్పూర్లో జరిగిన ఘటనే కార్పొరేటర్ అరెస్ట్కు దారితీసింది.
అర్ధరాత్రి దాటిన తర్వాత భోలక్పూర్ ప్రాంతంలో షాపులు బంద్ చేయాలని పోలీసులు అక్కడికి దుకాణదారులకు సూచించారు. సోమవారం అర్ధరాత్రి ఆ ప్రాంతానికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పారు. అయితే అక్కడి షాపు ఓనర్స్ దీనిపై పోలీసులతో గొడవపడ్డారు. రంజాన్ మాసంలో దుకాణాలు తెరుచుకుంటున్నామంటూ వారితో ఆర్గ్యుమెంట్కు దిగారు.
ఈ క్రమంలో మజ్లిస్కు చెందిన స్థానిక కార్పొరేటర్ గౌసుద్దీన్ అక్కడికి చేరుకుని పోలీసులపై తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఓ నెటిజన్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కేటీఆర్ స్పందించి ఆ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ను ముషీరాబాద్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 353, 506 సెక్షన్ల కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్లో వెల్లడించింది.