సీఎం జగన్తో తాను మొదటి నుంచి నడిచిన వ్యక్తినని.. వైసీపీ అంటే తమ పార్టీనే అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంత్రి పదవి రాలేదని తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి పిన్నెల్లి సీఎంను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సామాజిక సమీకరణల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ మంత్రి వర్గంలో భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. అందువల్లే సీనియర్లకు అవకాశం రాలేదన్నారు.
జగన్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా పూర్తిస్థాయిలో పనిచేస్తానని పిన్నెల్లి చెప్పారు. తమ టార్గెట్ 2024 ఎన్నికలేని తెలిపారు. సీఎం తనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని.. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆయన ఎవరికీ అన్యాయం చేయరని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.