తెలంగాణ కలను సాకారం చేసి.. బంగారు తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పండుగగా జరుపుకుంటారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
ఏఫ్రిల్ ఇరవై ఏడున హైటెక్స్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్ రావులతో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవం, అస్థిత్వానికి ప్రతీకగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 21 ఏండ్లు పూర్తయిన సందర్భంగా, హెచ్ఐఐసీలో ప్రతినిధుల మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది హాజరు కానున్నట్లు తెలిపారు. ఆహ్వానాలు అందినవారే సభకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సభకు వచ్చే వారికి పాసులు జారీ చేస్తామని వెల్లడించారు. రేపు మధ్యాహ్నం జీహెచ్ఎంసీ నాయకులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. గ్రామ శాఖల అధ్యక్షులు టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. 3,600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.