అల్వాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
28.41 ఎకరాల్లో జీ ప్లస్ 5 అంతస్తుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు రూ.897 కోట్లు కేటాయించారు. ఈ ఆస్పత్రి భూమి పూజ కంటే ముందు ఎర్రగడ్డ, కొత్తపేటలో టిమ్స్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే.
ప్రతి ఆస్పత్రిలో 26 ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసీయూ బెడ్స్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.ఈ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. వైద్య విద్య కోసం పీజీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి.