తెలంగాణ భవన్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోన్న తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడుతామని స్పష్టం చేశారు.తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుజరాత్ ఏర్పడి 62 ఏండ్లైనా కరెంట్ కష్టాలున్నాయి. ఎనిమిదేండ్లలో తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు.
సంక్షేమం మీద అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు లేవని స్పష్టం చేశారు. ఆకర్షణీయ నినాదాలు ఇవ్వడంలో బీజేపీ ఫస్ట్ ఉంటుందని నిరంజన్ రెడ్డి విమర్శించారు.తెలంగాణకు ఇతర ఏ రాష్ట్రాలు దరిదాపుల్లో కూడా లేవని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఏడేండ్ల సగటు ఆర్థిక వృద్ధిరేటు 11.7 శాతంగా ఉందన్నారు.
భారతదేశం సగటు ఆర్థిక వృద్ధిరేటు 6 శాతమే అని తెలిపారు. తెలంగాణ జీఎస్డీపీలో వ్యవసాయ రంగందే 21 శాతం అని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్గా ఉందన్నారు. ఐటీ, పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణనే ముందుందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం ద్వారా రిజర్వేషన్లు అందక నష్టపోతున్నారని తెలిపారు.