తన పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో 25లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చామని.. అదనంగా మెరుగైన సౌకర్యాలతో కట్టిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారం లే అవుట్లో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ మాట్లాడారు.
రాష్ట్రంలో సొంతంగా ఇల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చామని.. ఇచ్చిన మాటకంటే మెరుగైన సౌకర్యాలతో కట్టించి తీరుతామని చెప్పారు. ఈ ఒక్క కాలనీలోనే 10,228 ప్లాట్ల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం రూ.10వేల కోట్లకు పైనే ప్రభుత్వం భర్తిస్తోందని చెప్పారు. ఇల్లు ఒక శాశ్వత చిరునామా అని.. తర్వాత తరానికి ఇచ్చే ఆస్తి అని చెప్పారు. అలాంటి ఇళ్లను ఇవ్వడంతో పేదలకు సామాజికహోదా కల్పించినట్లవుతుందన్నారు.
ఇలాంటి మంచి పనికి 16 నెలల క్రితమే అడుగులు వేశామని.. కానీ ప్రభుత్వం మంచి చేస్తుంటే దుష్టచతుష్టం కడుపు మంటతో రగిలిపోతోందని జగన్ విమర్శించారు. ఎక్కడ వైసీపీ ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేస్తుందోనని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారని గుర్తు చేశారు. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవడానికి చూశారన్నారు. కోర్టు వ్యవహారాలు పూర్తికావడానికి 489 రోజులు పట్టిందని.. దేవుడి దయతో సమస్య తీరి లక్షల మందికి మేలు చేసే అవకాశం కలిగిందన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా మాట తప్పబోమని.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని జగన్ స్పష్టం చేశారు..