వేసవి సెలవుల్లో పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులును ఆదేశించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై మంత్రి సబిత అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. అధికారుతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లిదయాకర్రావు, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘మన ఊరు-మన బడి’ పురోగతిపై చర్చించారు.
మొదటి విడతలో చేపట్టిన పనులను జూన్ 12 నాటికి పూర్తిచేయాలని మంత్రి సబిత ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. డిజిటల్ విద్యాబోధనకు సదుపాయాల కల్పన, ఇంగ్లిష్ మీడియంలో టీచర్లకు ట్రైనింగ్, సదుపాయాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యేకంగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నందున ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో టీచింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు సబిత తెలిపారు. ఐటీ ఇతర అంశాలపై మంత్రి కేటీఆర్ కొన్ని సూచనలు చేశారని.. వాటిని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు.