టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 5 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. నడక దారి భక్తులకి దివ్యదర్శనం టికెట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం స్లాట్ విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం, పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల నిర్మాణానికి రూ.21 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరో ఏడాదిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని పాలకమండలి తీర్మానించింది. ఘాట్ రోడ్లలో మరమ్మతులకు రూ.36 కోట్లు కేటాయించారు. అన్నప్రసాద కేంద్రం, లడ్డూ తయారీకి బయోగ్యాస్ ఉపయోగించాలని నిర్ణయించారు.
మరోవైపు ముంబయిలో తిరుమల శ్రీవారి ఆలయం నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని.. అక్కడ త్వరలోనే ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆ స్థలం విలువ సుమారు రూ.500 కోట్లు అని చెప్పారు. ఆలయ నిర్మాణానికి గౌతమ్ సింఘానియా ముందుకొచ్చారని తెలిపారు.
.