తలసేమియా వ్యాధి బారిన పడిన పిల్లలను చూస్తుంటే బాధ కలుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ కింద అలాంటి పిల్లలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు.తలసేమియా, సికెల్ సెల్ సోసైటీ ఆధ్వర్యంలో కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సదస్సుకు మంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
తెలంగాణలో కమలా సోసైటీ తలసేమియా రోగులకు మంచి సేవ అందిస్తోందని హరీశ్రావు ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉస్మానియా, నీలోఫర్, గాంధీ ఆసుపత్రుల్లో తలసేమియా రోగులకు చికిత్స అందిస్తోందన్నారు. బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
కమలా సొసైటీకి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. రెడ్ క్రాస్ సోసేటీ, కమలాసోసైటీ వంటి సంస్థలతో మరో మారు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఇంకా తలసేమియా అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిద్దామని హరీశ్రావు పేర్కొన్నారు. తలసేమియా వ్యాధి నివారణపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ తలసేమియా రహిత రాష్ట్రంగా, దేశంలో తలసేమియా కేసులు లేని తొలి రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తాం. ఈ వ్యాధి నివారణకు మా వంతు కృషి చేస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు.