ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ముస్లింలను గౌరవంగా నిలబెట్టారన్నారు. దేశంలో ఇఫ్తార్ విందు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. అందరి సహకారంతో ఖమ్మం ను అభివృద్ధి చేసుకున్నామని, అభివృద్ధి విషయంలో వేలెత్తి చూపేవారే లేరన్నారు. ప్రతి ఒక్కరూ ఖమ్మం అభివృద్ధి బాగుందని కొనియాడుతున్నారన్నారు.
పట్టణాన్ని అల్లా దయవల్ల సీఎం కేసీఆర్ సహకారంతో మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ముస్లిం ఆడపిల్లలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచేలా షాదీ ముబారక్ పేరిట ఆర్థిక సాయం అందిస్తున్నారని, దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని చెప్పారు. అంతే కాకుండా విద్య కోసం పెద్దపీట వేశారని మైనార్టీ పాఠశాలను ఏర్పాటు చేసి వారి చదువుకు భరోసా అందిస్తున్నారని తెలిపారు. దేశంలో మైనారిటీ పాఠశాలలు ఏర్పాటు చేసి, వారి అభ్యున్నతి కోసం పాటు పడుతూ తెలంగాణ రాష్ట్ర మోడల్గా నిలిచిందని ఇటీవలే ఓ నివేదిక కూడా తెలిపినట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.