ఎంతోమంది యువత, తల్లుల రక్తం, ఆయా కుటుంబాల కన్నీళ్లతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ మాట్లాడారు. ఏ కలలు నెరవేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవని.. అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని తెలిసినా ప్రజల మేలు కోరుతూ సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని రాహుల్ చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగడం లేదని ఆయన ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రజలు, రైతులు, కార్మిక ప్రభుత్వం వస్తుందనుకున్నామని.. కానీ ఆ కల నెరవేరలేదని రాహుల్ విమర్శించారు.