ఏపీలో నారాయణ విద్యాసంస్థ సహా మరికొన్ని ఫ్యాక్టరీలా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయా సంస్థలు ఎన్నో ఏళ్లుగా విద్యావ్యవస్థలో మాల్ ప్రాక్టీస్కి పాల్పడుతున్నాయని చెప్పారు. టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్మీట్లో సజ్జల మాట్లాడారు.
టెన్త్ పరీక్షలు ప్రారంభం కాగానే ఆయా సబ్జెక్టుల క్వశ్చన్ పేపర్లను ఫొటోలు తీసి కొందరికి పంపించారని.. ఇందులో నారాయణ ప్రమేయం కూడా ఉందన్నారు. ఆయన అరెస్ట్లో రాజకీయ కక్ష సాధింపు ఏమీ లేదని చెప్పారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా, గవర్నర్కు చంద్రబాబు లేఖలు రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ఆ విద్యా సంస్థల వెనుక చంద్రబాబు కూడా ఉన్నారా? అనేది అర్థం కావడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. నారాయణకు బెయిల్ను సవాల్ చేస్తూ పైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.