ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్ను ప్రారంభించి గోదావరి, కృష్ణా వాటర్ను ముందే విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల నవంబర్లో తుపాను వచ్చే నాటికి పంట చేతికి వస్తుందని మంత్రివర్గం అభిప్రాయం వ్యక్తం చేసి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది.
గోదావరి డెల్టాకు జూన్ 1, కృష్ణా డెల్టాకు జూన్ 10, రాయలసీమ ప్రాజెక్టుల నుంచి జులై 30న నీరు విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు రానున్న రెండునెలల్లో రాష్ట్రంలో అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలకు క్యాలెండర్ను మంత్రి వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. దీని ప్రకారమే పథకాలను అమలు చేసేందుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. మే 13న మత్స్యకార భరోసా కార్యక్రమం.. దీన్ని కోనసీమ జిల్లాలో ప్రారంభించాలని నిర్ణయించారు.
మే 16న రైతు భరోసా, జూన్ 14న వైఎస్ఆర్ పంటల బీమా కింద ఖరీఫ్లో నష్టపోయిన రైతులకు బీమా చెల్లింపు, జూన్ 21 అమ్మఒడి తదితర పథకాలను అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు మంత్రి వేణు తెలిపారు.