తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్తో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేసీఆర్కు దగ్గరుండి ఆ పాఠశాలను చూపించారు.
ఈ సందర్భంగా అక్కడ కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పొలిటికల్ లీడర్లు కలిసినపుడు పాలిటిక్స్ గురించే మాట్లాడుకుంటారన్నారు. దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉందని చెప్పారు. అయితే అది తొందర్లోనే జరుగుతుందని.. ఏంటనేది భవిష్యత్లో అందరూ చూస్తారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్-బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటూ కేసీఆర్ ఇటీవల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యనేతలతో ఆయన సమావేశం అవుతున్నారు.
మరోవైపు ఢిల్లీలోని విద్యావ్యవస్థను కేసీఆర్ కొనియాడారు. ఢిల్లీలో విద్యావ్యవస్థ బాగుందని.. ఉద్యోగాలు పొందేందుకు విద్యార్థులకు అవసరమైన శిక్షణ అద్భుతంగా ఇస్తున్నారని చెప్పారు. దేశం ఎక్కడా ఇలాంటి విద్యావిధానం లేదన్నారు. తెలంగాణలోనూ దీన్ని అమలు చేస్తామని చెప్పారు.